నపుంసంకులు దేవుని రాజ్యము వెళతారా ?
విమర్శ: ఆడంగితనము గలవారు (నపుంసంకులు) దేవుని రాజ్యము వెళతారా? వెళ్లరా? 1 కొరింథీ 6:9 లో దేవుని రాజ్యము ప్రవేశింపరని వ్రాయబడియున్నది. మరియు అపొ. కా॥ 8:36 లో నపుంసకుడు బాప్తిస్మము పొందుచున్నాడు. గనుక నపుంసకులు దేవుని రాజ్యమునకు వారసులు కాగలరా? కాలేరా?
జవాబు: ఆడంగితనము గలవారు దేవుని రాజ్యమునకు వారసులు కాగలరా? అనునది మంచి ప్రశ్నయే. భక్త పౌలుగారు 1కొరింథీ 6:9 లో ఆడంగితనము గలవారు దేవుని రాజ్యమునకు వారసులు కారని వ్రాసియున్నాడు. యెషయా గ్రంథము 56:3-5 “యెహోవాను హత్తుకొను అన్యుడు – నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు” షండుడు “నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను అనుసరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధననాధరము చేసికొనుచున్న షండులను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు – నా యింటను నా ప్రాకారములోను ఒక భాగమును వారికిచ్చి కొడుకులు కూతుళ్ళు యని అనిపించుకొనుట కంటె శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టి వేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను” అని వ్రాయబడి యున్నది. కాని పౌలు గారు చెప్పినట్లు నపుంసకులు దేవుని రాజ్యములో ప్రవేశించ జాలరు. ఎందుకనగా వారు అతి కామాభిలాషకులు అయినను వారు ఇట్టి జార కార్యములను విడిచి యెషయా 56:4 లో వ్రాయబడిన ప్రకారము ఆయన (యెహోవా) నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు ఆయనకు యిష్టమైన వాటిని కోరు కొనుచు, జరిగించుచు, ఆయన నిబంధనలను గైకొనిన యెడల వారిని వెలివేయక తన యింటిలోను తన ప్రాకారములోను ఒక భాగమును వారికిచ్చి కొడుకులు కూతుళ్ళు అని పిలువబడుటకంటె గొప్ప పేరు వారికి పెట్టెదనని యెహోవాయే సెలవిచ్చియున్న కారణముగానే నపుంసకులు దేవుని రాజ్యమునకు వారసులు కాగలరని గ్రహించగలము. ఆ ప్రకారమే అపొ. కా॥ 8:26, వచనాల్లో ఐతియోపీయు మీద ఆర్ధికశాఖ మంత్రి నపుంసకుడైనను దైవ లేఖనాలను పాఠించి ఫిలిప్పు బోధించగా వాటిని అంగీకరించి, తక్షణమే బాప్తిస్మము పొంది యున్నాడు. యేసుప్రభువు తన యందు నమ్మికయుంచిన పలు విధములగు వ్యాధిగ్రస్తులను స్వస్థ పరచిన విధముగానే వీరిని (నపుంసకులను) స్వస్థ పరుస్తాడు. ఆడంగితనము అనునది కూడ అంగవిహీనమే గనుక ఆయనయందు విశ్వాసము యుంచి, ఆయన న్యాయ విధులను అనుసరించునట్లు తమ ప్రాణాత్మ శరీరాలను ప్రభువునకు అప్పగించుకొని, కామేచ్ఛలను చంపుకొనిన వారిని ప్రభువు స్వస్థపరచి వారికి తన యింటిలోను తన ప్రాకారములోను ఒక భాగమును యిస్తాడు.
అంతేగాక, కుమార్లు, కుమార్తెలు యని పించుకొనుట కంటె గొప్ప భాగ్య మేదియు లేదు. కాని నపుంసకులకు దానికంటె గొప్ప పేరు పెట్టెదననియు ఎన్నటికి కొట్టి వేయబడని నిత్యమైన పేరును పెట్టెదననియు ప్రభువైన యెహోవా తండ్రియే సెలవిచ్చు చున్నాడు. కావున షండుడు ఇక నేను ఎండిన చెట్టని అనుకొనకూడదు. షండుడు (నపుంసకుడు) కూడ నిశ్చయముగా దేవుని రాజ్యములో ప్రవేశింపగలరనిసత్యాన్వేషకులు గ్రహించగలరు. Writer : Dr Vasantha Babu Garu
Disclaimer:
The content on biblesamacharam.in website is for educational purposes only. We do not claim ownership or authorship of material gathered from external sources or the internet. Our use of such information is intended solely for learning and is in line with the fair use provisions under the Indian Copyright Act, 1957.