ADVERTISEMENT

Malachi – మలాకీ గ్రంథం – Malachi Bible Books Explanation

మలాకీ

Malachi Bible Books Explanation

 నెహెమ్యా కాలం నాటి ప్రవక్త అయిన మలాకీ భ్రష్టులైన యాజకులు, పాపంతో కూడిన ఆచారములతో పాడైపోయిన ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్నాడు. ప్రశ్న – జవాబు పద్ధతినుపయోగించి వారి వేషధారణను, అవిశ్వాసమును, అన్యులతో వారి వివాహ సంబంధములను, విడాకులను, నిర్లక్ష్యమును, ఆచార పూర్వకమైన ఆరాధనను ఎండగడుతున్నాడు. దేవుని మాటలు వారి మీద ఎటువంటి ప్రభావము చూపలేసంతగా ప్రజలు పాపముతో నిండిపోయారు. తత్ఫలితంగా మలాకీ ప్రవచనం తరువాత 400 సంవత్సరములు. దేవుడు మౌనముగా నుండిపోయారు. బాప్తీస్మమిచ్చు యోహాను ద్వారా మాత్రమే దేవుడు మరలా తన ప్రజలతో మాటలాడుట ఆరంభించారు. 

గ్రంధరచయిత : 

 పాతనిబంధనలో మలాకీ అనుపేరు కేవలం మలాకీ 1:1లో మాత్రమే పేర్కొనబడినది. మలాకీయే ఈ గ్రంధము వ్రాసాడనుటలో ఎట్టి సందేహములేదు. మలాకీ యొక్క గ్రంధకర్తృత్వమును గూర్చి, వ్రాయబడిన కాలమును గూర్చి, గ్రంధము యొక్క ఏకత్వమును గూర్చి ఎట్టి సమస్యలేదు. అయితే మలాకీని గూర్చి మరే ఇతర వివరములు (కనీసం అతని తండ్రిపేరు కూడ తెలియవు. యూదుల పారంపర్య నమ్మకం ప్రకారము జెకర్యా -వలె మలాకీ సైతం మహా సమాజమందిరములో (Great Synagogue) సభ్యుడు. 

వ్రాయబడిన కాలము : 

మలాకీ ప్రవచనమునకు ఖచ్చితమైన సమయమును నిర్ణయించలేకపోయినప్పటికి, అంతర్గత సాక్ష్యములను (Internal Evidences) బట్టి approximateగా వ్రాయబడిన కాలమును గుర్తించవచ్చు. ‘అధికారి’ అనుటకు ఉపయోగించబడిన ‘పెకా’ (Pechah) అను పారశీక పదమును బట్టి (మలాకీ 1:8, హగ్గయి 1:1,14, 221) ఇశ్రాయేలీయులు పారశీకుల ఆధిపత్యము క్రిందనున్న కాలములోనే (539-333 B.C.) ఈ గ్రంధము వ్రాయబడినదని భావించవచ్చు. 1:7-10, 3:8 ప్రకారము 516 B.C.లో నిర్మాణం ముగించబడిన దేవాలయములో బలులు. అర్పించబడుతున్నాయి. బలులనర్పించుట మొదలై చాలా కాలమైందని చెప్పవచ్చు. వీటికి తోడు మలాకీ కూడా నెహెమ్యా ఎదుర్కొనిన సమస్యలనే ఎదుర్కొన్నాడు. భ్రష్టులైన యాజకులు (1:6 2:9, నెహెమ్యా 13:1-9) దశమ భాగములను, అర్పణలను నిర్లక్ష్యము చేయుట (3:7-12 cf. నెహెమ్యా 13:7-12), అన్యులతో వివాహ సంబంధములు (2:10 – 16  నెహెమ్యా 13:25-28)

పడద్రోయబడిన యెరూషలేము ప్రాకారములను పునర్నిర్మించుటకు నెహెమ్యా 444 B.C. లో యెరూషలేముకు వచ్చాడు. 12 సంవత్సరముల తరువాత 432 B.C.లో పర్షియాకు వెళ్లి 425 B.C.లో యెరూషలేముకు తిరిగివచ్చి తాను లేని 7 సంవత్సరముల కాలములో ప్రజలలో ప్రవేశించిన పాపములను బట్టి వారిని గద్దించాడు (నెహెమ్యా 13:1-31). కాబట్టి నెహెమ్యా యెరూషలేములో లేని 7 సంవత్సరముల కాలంలో, అనగా 432–425 B.C.లో బహుశా (హగ్గయి, జెకర్యాలు ప్రవచించిన ఒక శతాబ్దము తరువాత) ప్రజలకు తన సందేశమును మలాకీ ప్రకటించాడు. 

‘మలాకీ గ్రంధ విశేషతలు : 

  1. మలాకీ గ్రంధము పాతనిబంధన అంతటి సారాంశమును క్లుప్తరూపములో తెలియపరుస్తుందని చెప్పవచ్చు. పాతనిబంధనలో కనబడు ఐదు ముఖ్య సత్యములను ప్రవక్త తన గ్రంధములో పేర్కొంటున్నాడు. అవి :
  • దేవుడు ఇశ్రాయేలును ఎన్నిక చేయుట (1:2, 2:4-6, 10) – Selection
  • దేవునికి వ్యతిరేకముగా ఇశ్రాయేలీయుల అపరాధము (1:6, 2:11, 17) – Transgression 
  • .మెస్సియా యొక్క ప్రత్యక్షత (3:1,4-2) – Manifestation
  • రాజ్యముల మీదకు రాబోతున్న శ్రమ (4:1) – Tribulation
  • చివరకు ఇశ్రాయేలు పరిశుద్ధ పరచబడుట (3:2-4, 12, 16-18, 4:2-6)  Purification 
  1. పాతనిబంధనలో మెస్సియాను గూర్చిన మొదటి ప్రవచనమును మోషే వ్రాయగా (ఆది. 3:15) చివరి ప్రవచనమును మలాకీ వ్రాస్తున్నాడు. (42).

3) దానియేలు 9.24-27లోని 70 వారములలో మొదటి 7వారములు (445-396 B.C.) ముగింపులోనే మలాకీ తన పరిచర్య ముగించాడని చాలామంది పండితులు భావిస్తారు. 

మలాకీ గ్రంధ విభజన : 

 హగ్గయి, జెకర్యాల ప్రవచనములు ఇంకా నెరవేరకపోవుటచే ఇశ్రాయేలు ప్రజలు దేవుని సందేహించుట ఆరంభించారు. వారి విశ్వాసము అడుగంటిపోయి దేవుని మంచితనమును, సంరక్షణను ప్రశ్నించుట ఆరంభించారు. ప్రయోజనం ఏమైనా ఉందా అన్న తలంపు బయలుదేరింది. వారి హృదయములలో దేవుని సేవించుటవలన అసలు పండుగలను యాంత్రికముగా ఆచరించుటలోను, వేషధారణలోను, దశమ భాగములు అర్పణల. విషయంలో మోసగించుటలోనూ వారి అంతర్గత వైఖరి బట్టబయలయ్యింది. వారి యాజకులు భ్రష్టులయ్యారు, వారు దుష్టక్రియలు చేస్తూ తామెందుచేత దేవునిచే దీవించబడుట లేదని ప్రశ్నిస్తున్నారు. ఆత్మీయంగా మొద్దుబారిన వారై పోయారు. 

 ప్రశ్న – జవాబు పద్ధతిని ఉపయోగించి దేవుడు వారి కఠిన హృదయములను బద్దలు చెయ్యాలని ఆశిస్తున్నారు. వారి హృదయంలోని ప్రశ్నలను ఎరిగిన దేవుడు తానే ఆప్రశ్నవేసి తానే జవాబిస్తున్నారు. ఇట్టి ఏడు ప్రశ్నలను మలాకీ గ్రంధ మొదటి భాగములోను (1:1-3:18), దేవుడు వారికిచ్చిన వాగ్దానమును రెండవ భాగములోను (4:1-6), మనము చూడవచ్చు. 

ఎ) ప్రజల పాపములను తెలియచేయు ఏడు ప్రశ్నలు – సమాధానములు (1:1-3:18) : 

1) మొదటి ప్రశ్న (1:2-5) : దేవుడు వారియెడల ప్రేమ చూపినప్పటికి వారి హృదయములో ఏ విషయమందు నీవు మాఎడల ప్రేమ చూపితివని ప్రశ్నిస్తున్నారు. దానికి జవాబుగా దేవుడు తాను యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషించిన విషయమును జ్ఞాపకం చేస్తున్నారు. గతంలో వారి పక్షముగా దేవుడు చేసిన కార్యములను మరచిపోయి ప్రస్తుత సమస్యలను బట్టి దేవుని ప్రేమను ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఏశావు, యాకోబులు వ్యక్తులు కాదు గాని వారి నుండి ఉద్భవించిన ఎదోము, ఇశ్రాయేలు రాజ్యములను “సూచిస్తాయి. ఎదోము వారి పాపములను బట్టి దేవుడు వారిని సంపూర్తిగా నిర్మూలము చేసారు (ఓబద్యా 9,10). అయితే ఇశ్రాయేలీయులను శిక్షించినప్పటికి వారిని తిరిగి పునరుద్ధరించారు. అయినప్పటికి మలాకీ కాలంనాటి ప్రజలు ఏవిషయమందు మాయెడల ప్రేమ చూపితివని దేవుని ప్రశ్నిస్తున్నారు. 

2) రెండవ ప్రశ్న (1:6-29) : యాజకులు దేవుని నామమును నిర్లక్ష్యపెడుతూ, తండ్రియైన దేవుని ఘనపరచక, యజమానియైన దేవునికి భయపడక ఏమి చేసి నీనామమును నిర్లక్ష్యపెట్టితిమని ప్రశ్నిస్తున్నారు. దేవుడు సమాధానమిస్తూ వారు ఏవిధముగా ఆయన నామమును నిర్లక్ష్యపరిచారో వివరిస్తున్నారు. 

  • బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును అర్పిస్తూ యెహోవా భోజనపు బల్లను నీచపరచారు.
  • గ్రుడ్డి దానిని, కుంటి దానిని, రోగము గలదానిని తీసుకొని బలిగా అర్పిస్తున్నారు. .
  • యెహోవా భోజనపు బల్ల. అపవిత్రమనియు, దానిమీద ఉంచబడిన భోజనము నీచమనియు చెప్పుచు దానిని దూషిస్తున్నారు.
  • అయ్యో, ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారు:
  • మందలో మగది యుండగా యెహోవాకు మ్రొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పిస్తున్నారు.
  • మార్గము తప్పి ధర్మశాస్త్ర విషయములో అనేకులను అభ్యంతరపరచి, లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేసియున్నారు. పైవిధముగాచేసి దేవుని నామమును నిర్లక్ష్యపెట్టినందున దీవెనలను వారినుండి తీసివేస్తున్నారు.
  • మీలో ఒకడు నా, బలిపీఠము మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నామందిరపు వాకిండ్లు మూయువాడొకడు మీ లో ఉండిన యెడల మేలు. మీయందు నాకిష్టము లేదు, మీచేత నైవేద్యములను అంగీకరింపనని దేవుడు సెలవిస్తున్నారు.
  • మీ మీదకు శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. ఇంతకుమునుపే శపించియుంటిని
  • మిమ్మును బట్టి విత్తనములను చెరిపివేతును, మీ ముఖముల మీద పేడవేతును. పేడ ఊడ్చి వేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు.
  • దేవుని మార్గము ననుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో పక్షపాతులు కనుక జనులందరి దృష్టికి వారిని తృణీకరింపదగినవారు గాను నీచులనుగాను చేసెదను.

3) మూడవ ప్రశ్న (2:10-16) : ఎందుకు మా అర్పణలు అంగీకరించుటలేదు అని ప్రజలు ప్రశ్నించగా దేవుడు అందుకు గల కారణములను తెలియపరుస్తున్నారు. 

  • ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేయుచు పితరులతో చేయబడిన నిబంధనను తృణీకరించారు.
  • యూదావారు ద్రోహులయ్యారు. ఇశ్రాయేలీయుల మధ్య యెరూషలేము లోనే హేయక్రియలు జరుగుచున్నవి.
  • యూదావారు యెహోనాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి- అన్యదేవత పిల్లలను పెండ్లి చేసికొను నిమిత్తము తమ పెండ్లి భార్యలను అన్యాయముగా విడచిపెడుతున్నారు.
  • ఇందుచేతనే వారి అర్పణలను అంగీకరించుటలేదని, వారు అన్యాయముగా విసర్జించిన పెండ్లి భార్య పక్షమున తానే సాక్షియయ్యానని దేవుడు సెలవిచ్చారు. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరును ఈలాగున చేయరు కనుక మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనమున పెండ్లి చేసుకొనిన భార్యల విషయమై విశ్వాసఘాతకులుగా ఉండకుడని, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియయని యెహోవా, వారిని హెచ్చరించారు.

4) నాల్గవ ప్రశ్న (217-3:6): వారి మాటలచేత యెహోవాను ఆయాసపెట్టుచు దేనిచేత ఆయనను ఆయాసపెట్టుచున్నామని వారు ప్రశ్నిస్తున్నారు. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారియందు ఆయన సంతోష పడును లేక న్యాయకర్తయైన దేవుడు ఏమాయెను అని చెప్పుకొంటూ వారాయనను ఆయాసపెడుతున్నారు. మరోమాటలో చెప్పాలంటే వారు దేవుని న్యాయమును (God’s Justice) ప్రశ్నిస్తున్నారు. Bible Books Explanation in Telugu

దీనికి జవాబుగా వారిమీదకు తాను పంపబోతున్న తీర్పును మరియు మెస్సియా రాకడను గూర్చిన వాగ్దానమును దేవుడు వారికి ప్రకటిస్తున్నారు. వారు వెదుకుచున్న ప్రభువు. అనగా వారు కోరుకొనిన నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఆయన వచ్చు దినమును ఎవరును ఓర్వలేరు. ఆయన కంసాలి అగ్నివంటివాడు, చాకలివాని సబ్బువంటివాడు. ఆయన తన ప్రజలను నిర్మలులను చేయును అప్పుడు యూదా వారు యెరూషలేము నివాసులు చేయు నైవేద్యములు యెహోవాకు యింపుగా నుండును. చిల్లంగి వారిమీద, వ్యభిచారుల మీద, అప్రమాణికుల మీద, దేవునికి భయపడక కూలి విషయంలో కూలివారిని విధవరాండ్రను, తండ్రిలేని వారిని బాధపెట్టి, పరదేశులకు అన్యాయము చేయు వారి మీదకు తీర్పువస్తుంది. అయితే యెహోవా మార్పులేని వాడు కనుక యాకోబు సంతతివారు లయముకారు. Bible Books Explanation in Telugu

5) ఐదవ ప్రశ్న (3:7) : మేము దేని విషయంలో దేవుని వైపు తిరగాలని ప్రజలు ప్రశ్నించగా, మీ పితరులు నాటనుండి నా కట్టడలను గైకొనక . వాటిని త్రోసివేసారు కనుక కట్టడలను గైకొను విషయములో మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీతట్టు. తిరుగుదునని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చారు. 

6) ఆరవ ప్రశ్న (38-12) : దేని విషయములో మేము నీయొద్ద దొంగిలితిమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అందుకు జవాబుగా దేవుడు వదియవ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. తత్ఫలితంగా మీరు శాపగ్రస్తులైయున్నారు అని సెలవిచ్చారు. ఆయన మందిరములో ఆహారముండునట్లు పదియవ భాగమంతయు ఆయన మందిరపు నిధిలోనికి తీసుకురమ్మని, దానిచేసి ఆయనను శోధించిన ‘ఎడల వారికి కలగచేయబోవు దీవెనలను దేవుడు తెలియజేస్తున్నారు. అవి : ” 

  • ఆకాశవాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తాను.
  • ‘మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించేదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు.
  • మీ. ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్చక యుండును,
  • అప్పుడు ఆనందకర దేశములో మీరు నివసింతురు. .
  • అన్యులందరు మిమ్మును ధన్యులందురు.

7) ఏడవ ప్రశ్న. (3:13-18) : నీకు వ్యతిరేకముగా ఏమి పలికితిమని ప్రశ్నింపగా, వారు పలికిన మాటలను యెహోవా వారికి తెలిపారు. 

  • దేవుని గూర్చి బహు గర్వపు మాటలు పలికారు.
  • దేవుని సేవ చేయుట నిష్ఫలమన్నారు.
  • ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన సన్నిధిని దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనము లేదు అన్నారు.
  • గర్విష్ఠులు ధన్యులగుదురని యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురని వారు సంరక్షణ పొందుకుంటారని వారు చెప్పుకొంటున్నారు. తద్వారా దేవుని గుణమునే వారు శంకిస్తున్నారు.

అయితే. యెహోవాయందు భయభక్తులు కలవారు మాట్లాడుకొను మాటలను ఆయన చెవియొగ్గి ఆలకిస్తారని, ఆయన నామమును స్మరించుచు నుండువారి జ్ఞాపకార్ధం ఒక గ్రంధము ఆయన సముఖమందు వ్రాయబడెనని దేవుడు సెలవిచ్చారు. తాను నియమింపబోవు దినము (యెహోవా దినము)న నీతిగలవారిని, తనయందు భయభక్తులు కలవారిని దీవిస్తానని దుర్మార్గులను, తనను సేవించని వారిని శిక్షిస్తానని, దుర్మార్గులను నీతిమంతులను వేరు చేస్తానని దేవుడు సెలవిచ్చారు.  Bible Books Explanation in Telugu

బి) దేవుడు వారికిచ్చిన భవిష్యత్ వాగ్దానము (4:1-6): 

 నియమింపబడిన దినము అనగా యెహోవా దినమును గూర్చి, ఆ దినమున జరుగబోవు సంగతులను గూర్చి మలాకీ మాట్లాడుతున్నాడు. ముందుగా ఆదినమున గర్విష్ఠులు, దుర్మార్గులందరు తీర్పు తీర్చబడతారు (4:1) ఆయన నామమునందు భయభక్తులు గలవారందరు దీవించబడతారు. వారికి .నీతి సూర్యుడు ఉదయిస్తారు. అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేస్తాయి. ఆ దినమున నీతిమంతుల పాదముల క్రింద దుర్మార్గులు ధూళివలెనుందురు (4:2-3) 

 అందుచేత ఆ దినముకొరకు సిద్ధపడునిమిత్తము ధర్మశాస్త్రమును దాని కట్టడలు విధులను జ్ఞాపకం చేసుకొమ్మని దేవుడు హెచ్చరిస్తున్నారు. ఆదినము రాక మునుపు ప్రవక్తయగు ఏలియాను మీయొద్దకు పంపిస్తానని, అతడు వచ్చి తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల ‘ హృదయములను తండ్రుల తట్టుకు త్రిప్పును అని దేవుడు తెలియపరచారు. కొంతమంది ఈ ఏలియా బాప్తీస్మమిచ్చు యోహానే (లూకా 1:17, మత్తయి 11:13-14, 17:12-13, మార్కు 9:11-13) అని వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు ప్రకటన 11:3లోని ఇద్దరు సాక్షులలో ‘ ఒకడని వ్యాఖ్యానిస్తారు. 

మలాకీ గ్రంధములో అన్వయించుకొనదగిన సత్యములు 

1) ఆనాటి ప్రజల పెదవుల ఆరాధన, వేషధారణ వారి ఆత్మీయ జీవితము, కుటుంబ జీవితముల మీద ప్రభావం చూపాయి. ఈనాడు కూడా క్రైస్తవ సమాజ పరిస్థితి భిన్నముగా లేదు. దేవుని తీర్పును తప్పించుకొనుటకు ఒకే ఒక మార్గం – పశ్చాత్తాపముతో ఆయన వైపు తిరుగుట. 

2) దేవుడు మనుష్యులను ప్రేమిస్తున్నాడనుటకు ఆనాటి కంటే ఈనాడు ఇంకా ఎక్కువ సాక్ష్యాధారములున్నాయి. అయితే ఎక్కడైనా దేవుని ప్రేమను శంభిస్తున్నామా. 

3) దేవుడు తనను దేని విషయంలో శోధించమన్నారో ఆ విషయంలో ఆయనను శోధించి (మలాకీ 3:10) దీవెనలు పొందుకుందామా!

4) ఆయన యందు భయభక్తులుగలవారు మాటలాడు కొనుచుండగా ఆయన చెవియొగ్గి ఆలకిస్తారు కనుక మాటల విషయంలో జాగ్రత్తగా ఉందాము. 


ప్రసంగ శాస్త్రం కొరకు .. click here 

ADVERTISEMENT

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Bible Samacharam

Welcome to Bible Samacharam, a platform dedicated to enriching your understanding of God’s Word. My name is Naveen Kumar, and I have been serving as a church pastor for over 10 years. Through this journey, I’ve witnessed the deep thirst many have for biblical knowledge and a closer relationship with God.

🔴Related Post

Leave a Comment

error: Content is protected !!