ADVERTISEMENT

చార్లెస్. టి. స్టడ్ – Charles T Studd Life Story In Telugu

చార్లెస్. టి. స్టడ్

Charles T Studd Life Story In Telugu

ఛార్లెస్. టి. స్టడ్, ఎడ్వర్డ్ అనే ఒక ధనవంతుని కుమారుడు. చిన్నప్పటి నుండి ఎంతో సౌఖ్యముగా, ఆడంబరముగా పెరిగినవాడు. వేటయందు, క్రికెట్ నందు, గుఱ్ఱపు పందెములయందు ఆసక్తి కలిగినవాడు. తన 16 ఏళ్ళ వయస్సులోనే క్రికెట్ ఆటలో ప్రవీణుడయ్యాడు. స్టడ్ అందమైన, దృఢమైన శరీరం కలవాడు. తన ఆట నేర్పరితనమును బట్టి అతిశయించినవాడు. అనేక గంటలు అద్దం ముందు గడిపేవాడు. ఈలోగా డి.యల్. మూడీ అనే దైవజనుడు జరిపించిన కూటముల ద్వారా స్టడ్ తండ్రి పశ్చాత్తాపపడి మారుమనస్సు పొందెను. స్టడ్ తండ్రి ‘ఎడ్వర్డ్’ గుఱ్ఱపు పందెములను, ఆడంబరములను వదిలిపెట్టి క్రీస్తు కొరకు జీవించ నిర్ణయించుకున్నాడు. 

 తన ఇంటిలో ఒక పెద్ద గదిని ఖాళీ చేసి, సువార్త ప్రకటించుటకు వాడు చుండెను. తన ముగ్గురు కుమారులు కూడా రక్షించబడాలని ప్రార్థించాడు. స్టడ్, మూడీగారి ద్వారా సువార్తను విన్నప్పుడు కదిలించబడెను. గాని తన హృదయాన్ని ప్రభువుకిచ్చుటకు వెనుకాడుచుండెను. ఈలోగా స్టడ్ సహోదరుడైన ‘జార్జి’ బహు వ్యాధిగ్రస్థుడై పడక మీద ఉండుట చూచినప్పుడు ఛార్లెస్కు గొప్ప కనువిప్పు కలిగెను. ఈ లోకపు అందచందాలు, ఆస్తి పాస్తులు తాత్కాలికమైనవని; ఆధ్యాత్మిక జీవితము ఎంతో విలువైనదని గ్రహించుకొనెను. ఆ సమయంలో డి.యల్. మూడీ గారు జరిపిస్తున్న ఒక విద్యార్థుల కూటములకు హాజరై అచ్చట తన జీవితమును క్రీస్తునకు పూర్తిగా అప్పగించెను.

 అప్పటికి అతను బి.ఏ. ముగించి తానొక న్యాయవాదినవ్వాలనే కోరికతో ఉండెను. కాని అతను రక్షించబడిన తర్వాత, “ప్రపంచంలో వేలకొలది ఆత్మలు నశించుచుండగా, లోక ఘనతను, ఆనందమును ఆశించి, నా జీవితమును ఎట్లు వృథాపరచుకొనగలను?” అనుకొని, క్రీస్తుకొరకు మిషనెరీగా వెళ్ళగోరెను. తన క్రికెట్ ఆటను, చదువును, తల్లిదండ్రులను, ఆస్తిని విడిచిపెట్టి యేసును వెంబడించ నిశ్చయించుకొనెను. క్రికెట్ ఆటలో ప్రఖ్యాతి గడించిన వారు, స్టడ్ నెరిగిన వారు అనేకులు ఉండిరి. గనుక స్టడ్ వారియొద్దకు వెళ్ళి యేసుక్రీస్తు తనను ఏలాగు మార్చెనో సాక్ష్యమిచ్చుచుండగా అనేకులు విని ఆశ్చర్యపడుచుండిరి. తన జీవితములో మిషనెరీగా ఎక్కడికి వెళ్ళవలెనో ప్రార్థించుచుండగా “నన్నడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను” (కీర్తన 2:8) అను స్వరమును మాటి మాటికి వినుచుండెను. సువార్త అందని కోట్ల కొలది ప్రజలు ఉన్న చైనా దేశమునకు దేవుడు తనను వెళ్ళమను చున్నాడన్న గ్రహింపు కలిగెను. 

 అయితే అతని తల్లిదండ్రులు, స్నేహితులు, అతడు ఇంగ్లాండు దేశములోనే సేవ చేయవలెనని ఎంతో బ్రతిమిలాడినప్పటికిని తాను దేవుని చిత్తము చేయవలెనని స్టడ్ బయలుదేరి 1885 ఏప్రిల్ 1వ తేదీన చైనా దేశం చేరెను. ఆ దేశంలో షాంగై పట్టణం చేరి, దినమునకు 7 గంటలు కష్టపడి చైనా భాషను నేర్చుకొనెను. ప్రతి రోజు ఇంచుమించు 40 మైళ్ళ చొప్పున నడచి సువార్త ప్రకటించెను. తన పాశ్చాత్య మార్గాలను వదలి; వస్త్రధారణలోను, భోజన విషయాలలోను చైనా దేశస్థులను అనుసరించెను.

 విశ్వాసముతో ఎన్నో కష్టాలను ఓర్చుకొనుచు ఆత్మల రక్షణార్థమై ప్రయాస పడుచుండెను. ఈలోగా తన తండ్రి మరణించెననియు, ఆస్తిలో తనకు వచ్చిన భాగము విడిచిపెట్టి వెళ్ళెననియు ఉత్తరం వచ్చెను. స్టడ్ ఆ ధనమును ప్రేమించక, “నీకు కలిగినది అమ్మి బీదలకిమ్ము” అన్న దేవుని మాటకు విధేయతగా, తన ఆస్తిలో కొన్ని వేల డాలర్లను తాను రక్షించబడుటకు కారణమైన డి.యల్. మూడీగారి సేవకు, మరికొన్ని వేల డాలర్లు అనాథ పిల్లలకు సేవ చేయుచున్న జార్జి ముల్లరుగార్కి, మరికొన్ని డాలర్లను పేద ప్రజల మధ్య సేవ చేసే విలియంబూత్ స్థాపించిన రక్షణ సైన్యమునకు, మరి ఇతర సేవకులకు పంచి ఇచ్చెను. ఇయ్యుడి మీకియ్యబడుసన్నట్లుగా ఆయనే ఒక చిన్న మిషనెరీగా ఉండి అనేక సేవకులకు ఇచ్చినందున దేవుడాయనను అత్యధికంగా దీవించెను. ఆయన పరిచర్యలలో ఎప్పుడూ, ఏ లోటు కలుగలేదు.

 స్టడ్ చైనా వెళ్ళిన 3 సంవత్సరముల తర్వాత “ఐరిష్” దేశమునకు చెందిన మిషనెరీ అయిన “ప్రిస్కిల్లా స్టేవార్డ్” అనే భక్తి కలిగిన యువతిని వివాహం చేసుకొనెను. దేవుడు వారిని దీవించి 5 గురు బిడ్డలనిచ్చెను. అనేక కష్ట నష్టాల నోర్చుకొని చేయుచున్న 7 సంవత్సరముల పరిచర్య తర్వాత 800 మంది స్త్రీలు, పురుషులు రక్షించబడిరి. ఈ లోగా ఆయన ఆరోగ్యం బహుగా దెబ్బ తిన్నందున వ్యాధిగ్రస్థుడైన స్టడ్ ఇంగ్లాండు దేశమునకు తిరిగి వెళ్ళవలసి వచ్చెను. ఆలాగు 6 సంవత్సరములు ప్రార్థనలో గడిపెను. ఆయన ఆరోగ్యము కుదుటపడిన తర్వాత తిరిగి ఆయన దక్షిణ భారతదేశమునకు మిషనెరీగా వచ్చి అక్కడ కొంత పరిచర్య చేసెను. మిషనెరీ సేవలో ఉన్న అనేక ఇబ్బందులను బట్టి, సరైన ఆహారము, నీరు సమయానికి దొరకనందున, విశ్రాంతి లేనందున మరల వ్యాధిగ్రస్థుడై తన దేశమునకు చేరి విశ్రాంతి తీసుకొనుచుండెను. 

 రోజుల్లో మనుష్యులను తినే ఆఫ్రికా వారికి మిషనెరీ కావలెననే ప్రకటన చూచెను. ఆఫ్రికాకు ఎంతో మంది ఆఫీసర్లు (సైనికాధికార్లు), వ్యాపారస్థులు వెళ్తున్నారు. మరి యేసుని గూర్చి చెప్పుటకు ఎవరూ వెళ్ళడము లేదెందుకు? అని ఆలోచిస్తుండగా “నీవు వెళ్ళు” అనే స్వరము స్టడు వినిపించింది. ‘ప్రభువా! నేను వృద్ధుడను, 15 సంవత్సరముల నుండి వ్యాధిగ్రస్థుడనై బాధపడుచున్నాను’ అని అనగా “నేను నిన్ను స్వస్థపరచగలను! ఆఫ్రికా లాంటి చీకటి ఖండానికి నీవే వెళ్ళాలి” అని ప్రభువు స్వరము మరల వినిపించెను. చేతిలో చాలినంత డబ్బు లేకపోయినా శరీరంలో ప్రయాణం చేసేటంత ఆరోగ్యం లేకపోయినా తన ప్రాణాన్ని పానార్పణంగా యేసు కొరకు ధారపోయుటకే “స్టడ్” తెగించి, యేసు కొరకు తన యౌవనమును, ఉన్నత స్థితిని ఒకప్పుడు త్యాగం చేసెను; చైనా కొరకు, ఇండియా కొరకు తన ఆస్తినంతా త్యాగం చేసెను; ఇదిగో, ఇప్పుడు మనుష్యులను తినే ఆఫ్రికా ప్రజల కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేస్తానంటూ సిద్ధపడెను. “జూదమనేది మహా పిచ్చి, కాని దానికంటె యేసు పిచ్చి మరీ గొప్పది. జూదగాడు జూదములో సమస్తమును కోల్పోయినట్లే, యేసు కొరకు మనకున్నదంతా త్యాగం చెయ్యాలి అనేవాడు సి.టి. స్టడ్.

 ఆఫ్రికా వెళ్ళనివ్వకుండా, అనేకులు ఆయనను ఆటంకపరిచారు. గాని ‘ప్రభువు నన్ను వెళ్ళమని చెప్పాడు. నేను వెళ్తున్నాను. అక్కడ నేనేమి చేయలేక పోయినా ఇకమీదట రాబోయే మిషనెరీలకు ఒక మార్గదర్శిగా ఉంటాను. నా సమాధి సేవకులకు మొట్టమొదటి మెట్టుగా ఉండనివ్వండి. తన ప్రాణాన్ని కాపాడుకొనేవాడు దానిని తప్పక పోగొట్టుకుంటాడు’ అన్నాడు.

 స్టడ్ ఆఫ్రికా వెళ్ళి దేవుని కృప వలన మరి 20 సంవత్సరాలు సేవ చేసెను. వేలకొలది ప్రజలను యేసువద్దకు నడిపించెను. బైబిలును అనువదించెను. చివరికి వృద్దాప్యములో 69 వ ఏట ఆఫ్రికాలో తన చిన్న గుడిసెలోనే మరణించి, ప్రభువు సన్నిధికి వెళ్ళెను. “సైనికుడు, పరిశుద్ధుడు” అను మాటలు వ్రాయబడిన వస్త్రము సి.టి. స్టడ్ దేహముపై కప్పిరి. 


For More Stories….Click Here

ADVERTISEMENT

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Bible Samacharam

Welcome to Bible Samacharam, a platform dedicated to enriching your understanding of God’s Word. My name is Naveen Kumar, and I have been serving as a church pastor for over 10 years. Through this journey, I’ve witnessed the deep thirst many have for biblical knowledge and a closer relationship with God.

🔴Related Post

Leave a Comment

error: Content is protected !!